[0:13]శ్రీ త్రైలింగస్వామి సూక్తులు శ్రీ త్రైలింగస్వామి లోకములోని భక్తజనోద్ధరణకు ఉపదేశించిన అమూల్యమైన 40 సూక్తులను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకొని మన జీవితాలను మార్చుకుందాం. ఎవరికీ మరెవరి ప్రాణం తీసే అధికారం లేదు. ఈ ప్రపంచములోని ప్రాణులన్నీ సమానమే. హింసా ప్రవృత్తిని వదిలి వేయుటకు ప్రయత్నించు. ఎవడు ఎవరినీ తాళముతో బంధించలేరు. ఒకవేళ అలా బంధించగలిగితే, మృత్యు సమయములో జైలులో బంధించినచో ఎవరూ చనిపోరు కదా! ఈ విశ్వమునందు అణువు పరమాణువులలో ఎవడైతే అఖండ పరమాత్మను దర్శిస్తారో, వారికి చేదు, తీపి యందు తేడా ఉండదు. క్షణములోనే వారు యోగబలముచే చేదును మధురముగా మార్చుకొని స్వీకరించగలరు. ఆత్మ సర్వవ్యాపకమైనది. ఆత్మ తత్వమెరిగిన మహానుపురుషుడు ఎటువంటి యంత్ర సహాయం లేకుండానే విశ్వములో జరిగే ప్రతి సంఘటనను తెలుసుకొనగలడు మరియు ప్రకటించనూగలడు. భగవంతుని పేరు వినగానే దేని వలన భక్తుని కనుల నుండి నీరు వలకునో ఆ వ్యక్తి భగవత్ భావనలో తన్మయుడవునో దానినే ప్రేమ అని అంటారు. జీవుడు తాను చేసిన సుకృతులకు, దుష్కృతులకు అనుగుణంగా సుఖదుఃఖాలను అనుభవించడానికి జన్మలు ఎత్తుతూ ఉంటాడు. ఈ జన్మల సంగతి తెలుసుకోగలిగినవాడు మనిషి ఒక్కడే. మరో జన్మ అనేది లేకపోతే ఒకడు భాగ్యవంతుడు ఒకడు నిర్భాగ్యుడిగా ఎందుకు పుడతారు? జీవితంలో ఇన్ని భేదాలు ఎందుకు వస్తున్నాయి? ఈశ్వరుడు మన మంచి - చెడుల గురించి ఆలోచించడా? అట్లా ఎప్పుడూ జరగదు... అద్దంలో చూసినప్పుడు ముఖం ప్రతిబింబించినట్లే, ఒక జన్మలోని పరిస్థితులు మరొక జన్మలో ప్రతిఫలిస్తాయి. ఎవరి ధర్మాన్నీ ద్వేషించకూడదు. ఎవరికి ఏ ధర్మం పైన నమ్మకముంటుందో వారికి దాని వలనే ముక్తి లభిస్తుంది. అనన్య చిత్తులై భక్తిభావంతో భగవంతుని పిలిచేవారికి ముక్తి త్వరగా లభిస్తుంది. సమత, సత్సంగము, ఆలోచనము, ఆనందము అనే నాలుగింటిని ఎప్పుడూ మనం మిత్రులుగా గుర్తించాలి. ఈ ప్రపంచంలోకి మరల మరల తిరిగి రాకూడదనే కోరికను దృఢపరచుకోవాలి. భగవంతుని చేరడానికి ప్రయత్నించాలి. పిండిని పూరీ లాగా ఒత్తి సలసల మరిగే నూనెలో వేసినప్పుడు అందులో పచ్చి ఉన్నంతవరకు శబ్దం వస్తుంది. పూరీ అయిన తర్వాత అది శబ్దం చేయదు. అంతేకాక అది నూనె మీద తేలియాడుతుంది. అలాగ నీలోని అహంకారం పోయి నమ్రత వస్తేనే, నీవు ధర్మానికి చేరువవుతావు. అనేక మార్గాల గుండా ప్రవహించిన నదులన్నీ సముద్రంలోనే లీనమైనట్లుగా, ఉపాసనామార్గాలు వేరువేరు అయినప్పటికీ చివరకు బ్రహ్మత్వాన్ని పొందటమే మానవుల అంతిమ లక్ష్యం. మీరు నిరాశాజీవులు కావచ్చు. శాస్త్రంలో దేనిని చరమస్థితి అని చెప్పినారో, గట్టి ప్రయత్నం వలన మీరు కూడా దానిని పొందడానికి అర్హులవుతారు. ముముక్షువైనవాడు భగవంతుని స్థూల రూపాన్ని ఆశ్రయించాలి. లేకపోతే ఆయన సూక్ష్మరూపం గోచరించదు. యవ్వనకాలం చాలా కష్టతరమైనది. అధ:పతనం కావడానికి అదే సమయం. యవ్వనాన్ని సరైన రీతిలో గడపగలిగినవారే మహాపురుషులు అనబడతారు. జీవుడు కర్మానుగుణంగా సంతరించుకున్న సుఖము - దుఃఖము, స్వర్గము - నరకము వంటి ఫలాలను ఈ జగత్తులోనే అనుభవిస్తాడు. మానవుడా! నీవు అహంకరించడానికి ఎవరు నీకు అధికారం ఇచ్చారని ఒకసారి ఆలోచించు. అల్పాయుష్కులై, సత్కార్యములు ఏమీ చేయకనే చనిపోయినవారు చిన్న చిన్న పుస్తకాలవంటివారు. దీర్ఘాయుష్కులై మహత్కార్యములు చేసినవారు బృహత్ గ్రంధములవంటివారు. అలాంటివారు ప్రపంచములో అందరి కోసం ఏర్పడిన ఆదర్శ పాఠ్య పుస్తకాల వంటివారు. గురువు దగ్గర ఉన్నప్పుడు ఏ దేవతను పూజించకూడదు. ఒకవేళ ఎవరన్నా చేసినా అది విఫలమవుతుంది. గురువే కర్త, గురువే విధాత. గురువు సంతుష్టుడైతే దేవతలంతా సంతుష్టులవుతారు. గురువే గతి ప్రదాత. ఒకవేళ ఈశ్వరునికి కోపం వచ్చినా గురువు రక్షించగలుగుతాడు. కాని గురువుకు కోపం వస్తేనే ఎవరూ ఉద్ధరించలేరు. జపము, తపము, అర్చన, శాస్త్రము, మంత్రము మొదలైనవి ఏవీ గురువు కన్నా గొప్పవి కావు. గురువు యొక్క మూర్తిని ధ్యానిస్తూ ఆయన తత్వాన్ని ఎప్పుడూ జపించేవారికి కాశీవాస ఫలం లభిస్తుంది. గురువుతో పాటు ఏకాసనం మీద కూర్చోవటం గాని, కూర్చునే సాహసం గాని చేయరాదు. వారి మాటలు వేదవాణి. వారి పాదోదకం అమృతము. వారి ఆజ్ఞ శిరోధార్యం. వారి దర్శనం వలన జీవితం సఫలమవుతుంది. అపారమైన ఈ సంసార సాగరాన్ని తరించడానికి గురువు విలక్షణమైన కర్ణధారి. భగవంతుని కలువుడవడానికి ఎవరు పిచ్చివాళ్ళు అయిపోతారో, ఆయనను పొందటానికి ఎవరు విరహవేదన పడతారో, ఆయన దర్శనానికి ఎవరిలో ఎక్కువ ఉబలాటం ఉంటుందో, ఆ భగవంతుడు లభించకపోతే ఏది చక్కగా అనిపించదో, అప్పుడే ఆ భగవంతుని దయవలనే సద్గురు దర్శనం అవుతుంది. గురు అనుమతి లేనిదే ఆయన ముందు ఏ ఆసనం మీద కూర్చోరాదు. ఆయన ముందు తమ గొప్పతనం ప్రదర్శించుకోకూడదు. గురుశిష్యులిద్దరూ ఒక ప్రాంతం వారైతే త్రికాలములొను, గురువుకు నమస్కరించాలి. గురుధామం రెండు మైళ్ళ దూరంలో ఉంటే ప్రతి నెల నాలుగుసార్లు, ఎనిమిది మైళ్ళు లేదా అంతకన్నా ఎక్కువ దూరంలో ఉంటే నాలుగు నెలలకు ఒకసారి వెళ్ళి తప్పక నమస్కారం చేయాలి. అసత్యమును పలుకరాదు. ఎవరిని హింసించరాదు. అన్ని జీవులపట్ల సమానమైన దయను కలిగి ఉండాలి. సాధ్యమైనంతవరకు పరోపకారం చేయాలి. తెలిసి తెలిసి అన్యాయపు పనులు చేయరాదు. వ్యర్థంగాను, అతిగాను మాట్లాడకూడదు. జగత్తు మంచిదో, చెడ్డదో అని పరీక్షించి చూసి, దానిని ప్రేమించాలని అనుకోకూడదు. సమస్త జగత్తు ఆ సచ్చిదానంద స్వరూపమే. అందువలన సమస్త జగత్తు ప్రేమపాత్రమే. సంసారమే ధర్మానికి ప్రథమ స్థానము. గృహస్థుడు ఒకవేళ వానప్రస్థమార్గము లేక బ్రహ్మచర్యమార్గమే అవలంబిస్తే దానికి ఫలితం ఏమీ ఉండదు. మనసును స్థిరంగా ఉంచి, భక్తిభావంతో ఆత్మ చైతన్యాన్ని విశ్వ చైతన్యముతో కలుపడమే పరమ ధర్మము. ఈశ్వరుడు మనుషులకు కష్టం కలిగిస్తున్నాడంటే, సుఖాన్ని పొందడానికే. జీవునికి కష్టం కలిగించడం కూడా ఆయన పరమదయలోని భాగమే. దృఢచిత్తంతో అనాది రూప సర్వకారుకుడైన ఈశ్వరుని స్వరూపాన్ని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే ఉపాసన. ఒకవేళ ఎవరైనా అపకారం చేస్తే, అపకారం పొందిన వ్యక్తి, ఆ అపకారం ఎవరికి చేసారు అని ఆలోచించాలి. అట్లా ఆలోచిస్తే ద్వేషం అసలు కలుగనే కలుగదు. యోగసాధన చేయడం అంత సులభమైనది కాదు. యోగమనగా తన్మయత్వం చెందడం. దైవంపై తన్మయత్వభావము హృదయంలో కుదుటపడకపోతే యోగము కుదరదు. తన్మయత్వభావన కలిగిన తరువాత మరే అనుష్ఠానం అవసరం లేదు. తన్మయత్వభావమే యోగసిద్ధి. తేనెటీగ పూల సౌందర్యము, సుగంధములు చెడకుండా తేనెను మాత్రం ఎలా గ్రహిస్తుందో, అలాగే నీవు కూడా పాపములు అంటకుండా జ్ఞానసముపార్జన చేయాలి. పాపము మనమీదికి దండెత్తదని భావించి నిశ్చింతగా ఉండరాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క చుక్క చొప్పున పడిన నీటివల్ల కూడా బిందే నిండినట్లు జ్ఞానియైన వ్యక్తి కూడా పాపమయుడు అవుతాడు. అనవసరమైన మాటలు మాట్లాడకు. ఎక్కువగ మాట్లాడేవారు అబద్ధాలు ఎక్కువ చెబుతారు. శాంతి కొరకు ఎంతవరకు అవసరమో, అంతవరకే కొద్దిగా మాట్లాడాలి. మాయ అంటే అతిప్రేమ. చిరకాలం ఉండే రోగమే సంసారం. చింతయే జీవునికి జ్వరము. ప్రాణమిచ్చి అయినా చేయవలసిందే ఈశ్వరపాసన. ఒక ప్రణాళికను అనుసరించి, భక్తి విశ్వాసములతో సాధనచేస్తే, 3 నెలల్లోనే ఆత్మదర్శనం తప్పక కలుగుతుంది.

Trailinga Swami | జీవితాన్ని మలుపు తిప్పే 40 సూత్రాలు | Life motivation | Siddhaguru
Siddhaguru
10m 27s696 words~4 min read
Auto-Generated
Watch on YouTube
Share
MORE TRANSCRIPTS


